ఇబ్రహీంపట్నం: ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పు, పంచదార, గోదుమ పిండి ఇతర సరుకులు గతానికి భిన్నంగా ఇంటింటికి చేరవేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుంది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల ఆపరేటర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి నిత్యవసర సరుకులు అందజేస్తున్నారు. గతానికి భిన్నంగా అక్రమాలకు తావులేకుండా ఎన్టీఆర్ జిల్లాలో
5, 86, 645 మంది కార్డుదారులకు 374 మొబైల్ వాహనాల ద్వారా ప్రతి నెలా 8,375 మెట్రిక్ టన్నుల బియ్యం, సరుకులు మొదటి వారంలో కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.
రేషన్ పంపిణీలో సాంకేతిక పరిజ్ఞానం....
ప్రజాపంపిణీ వ్యవస్థలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు రూపకల్పన చేసింది. ఈ విధానంతో ప్రతినెలా సరుకుల తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రూట్మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ కెమెరా విధానం, బయోమెట్రిక్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున అక్రమాలకు తావులేదు. గతంలో 80 శాతం కార్డుదారులకు మాత్రమే రేషన్ పంపిణీ జరిగేది. వైఎస్సార్ సీపీ ప్రస్తుతం విధానంతో 90 శాతం వరకు పంపిణీ పెరిగింది. జిల్లాలో 5,86,645 మంది కార్డుదారులు ఉండగా వారిలో 5,63,582 మంది తెల్లరేషన్ కార్డులు, 23,063 అంత్యోదయ రేషన్ కార్డుదారులకు 8,375 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెలా పంపిణీ అవుతోంది. స్టాక్ పాయింట్ కేంద్రాలుగా 958 రేషన్ దుకాణాలు ఉండగా 374 మొబైల్ వాహనాలతో బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది.
గతానికి భిన్నంగా బియ్యం పంపిణీ...
గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామానికి ఒకటి, పట్టణాల్లో వార్డుకు ఒకటి చొప్పున రేషన్ డీలర్లు ఉండేవారు. ఆ గ్రామం, వార్డుకు చెందిన వారందరూ ఒకేచోటకు వెళ్లి సరుకులు పొందేందుకు అనేక అవస్థలు పడేవారు. ప్రస్తుత విధానంలో గ్రామ, వార్డు వలంటీర్ల ఆధ్వర్యంలో ఐదారు ఇళ్లు కలిగిన ప్రాంతానికి మొబైల్ వాహనం వచ్చి సభ్యుల వేలిముద్రతో బయోమెట్రిక్ వేయించుకుని సరుకుల అందజేస్తున్నారు. ఇంటి వద్దకే సరుకులు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సరుకుల కోసం రోజులు, గంటల తరబడి ఎదురు చూసే బాధలు తప్పాయి. సరుకుల పంపిణీలో అక్రమాలు, అవకతవకలు జరగకుండా 1902, 1967 టోల్ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ ఉండటం వలన జిల్లా ఉన్నతాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ కమిటీలు వాహనం ఎక్కడ ఉన్నా ఆకస్మిక తనిఖీ చేసే ఏర్పాట్లు చేశారు.
పక్కాగా ఇంటింటికి రేషన్ అందజేత
ఎన్టీఆర్ జిల్లాలో 5,86,645 మంది కార్డుదారులు ప్రతి నెలా 8,375 మెట్రిక్ టన్నులు పంపిణీ అందుబాటులో 374 మొబైల్ వాహనాలు