కర్నూలు: పెద్దాసుపత్రిలో చికిత్సపొందుతూ కోలుకోలేక గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలోని సంతోష్నగర్ బ్రిడ్జి వద్ద సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు కనుగొని సమాచారమివ్వగా 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందడంతో నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 94412 90736కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
కోసిగిలో చోరీ
కోసిగి: మండల కేంద్రమైన కోసిగిలో చోరీ జరిగింది. విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా పనిచేస్తున్న మాల నరసింహులు మంగళవారం కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో వెలసిన జెట్టప్ప తాత మఠానికి దర్శనార్థం కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం ఇంటి పక్కన వారు కుళాయి నీళ్లు పడుతుండగా తాళం పగిలి కింద పడి ఉండడం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకుని పరిశీలించగా బీరువా తలుపులు పగిలి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంగళవారం రాత్రి దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూ.1.50 లక్షల నగదు, 6.50 తులాల బంగారు నగలు అపహరించి వెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజా రెడ్డి తెలిపారు. కర్నూలు నుంచి క్లూయీస్ టీమ్ తెప్పించి వేలిముద్రలు సేకరించారు. దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
బొమ్మలసత్రం: నంద్యాల మండల పరిధిలోని మునగాల గ్రామంలో బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మల్లెపోగుల నరహరి ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. పండగ సందర్బంగా ఊరి మహిళలు స్థానిక సుంకులాపరమేశ్వరి ఆలయానికి బోనాలతో బయలుదేరారు. అనుమతి లేకుండా వారిని దగ్గరి నుంచి నరహరి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరహరి పురుగల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.