‘‘శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే.. సహస్ర నామ తత్తుల్యం.. రామనామ వరాననే’ అంటూ పురుషోత్తముడికి ప్రజలు పూజలు నిర్వహించారు. కోదండరాముడి సచ్చీలతను, సమర్ధతను స్మరించుకున్నారు. శరణు జొచ్చినవారికి అభయమివ్వడం.. పెద్దలను, మిత్రులను గౌరవించటం.. అసత్య మాడకుండటం.. ఏకపత్నీ వ్రతం మొదలైన నీల మేఘశ్యాముని సుగుణాలను కీర్తించారు. గురువారం ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కర్నూలు, నంద్యాలలో కల్యాణోత్సవమూర్తులను ఊరేగించారు. ఆదోని పట్టణంలో స్వామి వారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర పట్టణాల్లో భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.