అనుమానాస్పద స్థితిలో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యనా..ప్రమాదమా?

Published Wed, Sep 27 2023 1:54 AM

- - Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: గురురాఘవేంద్ర ప్రాజెక్ట్‌ డివిజన్‌–2 జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌బాబు మంగళవారం గుడేకల్‌ చెరువులో శవమై తేలాడు. అనుమానాస్పద స్థితిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మద్దికెర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన గొల్ల చిన్నహనుమంతు, భాగ్యమ్మకు సురేష్‌బాబు(32), మనోహర్‌ అనే ఇద్దరు కుమారులు. గురురాఘవేంద్ర ప్రాజెక్ట్‌ డివిజన్‌–2లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే గొల్ల చిన్నహనుమంతు కరోనా సమయంలో మృతి చెందడంతో కుమారుడు సురేష్‌బాబుకు జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది.

విధుల నిమిత్తం ఎమ్మిగనూరులోని టీబీపీ కాలనీలో గది అద్దెకు తీసుకున్న ఈ యువకుడు శుక్రవారం స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సి ఉందని ఇంట్లో చెప్పి ఎమ్మిగనూరుకు వచ్చిన సురేష్‌బాబు ఆ తర్వాత తల్లి భాగ్యమ్మ ఫోన్‌కు స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆమె ఆఫీస్‌కు ఫోన్‌ చేయగా డ్యూటీకి రాలేదని చెప్పడంతో వెంటనే ఎమ్మిగనూరుకు వచ్చి ఆచూకీ కోసం గాలిస్తుండగా మంగళవారం ఉదయం ఎల్‌ఎల్‌సీ కాలువ నుంచి గుడేకల్‌ చెరువులోకి ఓ మృతదేహం కొట్టుకొచ్చిందని తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం కుమారుడిదై ఉండటంతో బోరున విలపించారు.

పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఎల్‌ఎల్‌సీలో ప్రమాదవశాత్తు పడ్డాడా..లేక తానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement