కర్నూలు (సిటీ): గత మూడు రోజులుగా సుంకేసుల డ్యాంకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలు కేసీ ఆయకట్టు రైతులకు ఊరటనిస్తున్నాయి. పంటలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో గత పది రోజులుగా ఆయకట్టుకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. దీంతో బ్యారేజీ నుంచి పడిదెంపాడు గ్రామం వరకు ఉన్న పంటపొలాలకు నీరందని పరిస్థితి. బ్యారేజీలో ఉన్న నీటిని కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్యారేజీ నుంచి మునగాలపాడు వరకు కేసీ కెనాల్కు ఇరువైపులా ఉన్న మోటర్లను పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. దీంతో పాటు జి.శింగవరం సబ్ స్టేషన్ నుంచి ఆ మోటర్లకు విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. అయితే, దీనిపై నాలుగైదు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేసే ప్రయత్నం చేశారు. వర్షాభావ పరిస్థితులతోనే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేకపోతున్నామని మరోవైపు అధికారులు ఆయకట్టుదారులను నచ్చజెబుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న వేదవతి (హగరి) నది పరీవాహక ప్రాంతంలో మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల 2 వేల నుంచి 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నదిలోకి చేరింది. దీనికి ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువ భాగంలోని తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వాన నీరు కలిసింది. ఇలా మొత్తం 5 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం మంగళవారం సాయంత్రానికి ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర ఉన్నట్లు జలవనరుల శాఖ ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. సుంకేసుల బ్యారేజీకి రానున్న ఆ నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సాయంత్రం కేసీ కాలువకు వెయ్యి క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో నది తీర గ్రామాలతో పాటు కర్నూలు నగరపాలక సంస్థ తాగునీటి అవసరాలు తీరనున్నాయి.