● డిప్యూటీ సీఎం అంజాద్బాషా
కౌతాళం: వైఎస్సార్సీపీలో ముస్లింలకు సముచిత స్థానం లభించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. ఖాదర్లింగ స్వామి దర్గా ఆవరణలో నిర్మించిన నూతన మసీదును ఆదోని, మంత్రాలయం, గద్వాల ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, బాలనాగిరెడ్డి, మురళీకృష్ణమోహన్రెడ్డితో పాటు ఖాదర్లింగస్వామి దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చిష్తీతో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింకు నాలుగు ఎమ్మెల్యే, నాలుగు ఎమ్మెల్సీ పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదివి ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతో నేడు ఎంతో మంది వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. తాను 20 సంవత్సరాల నుంచి దర్గాకు వస్తున్నానని, నేడు దర్గా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మనమధ్యలో దర్గా 10వ పీఠాధిపతి సయ్యద్ సాహెబ్పీర్ సాహెబ్ లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. అనంతరం కోసిగి, చిన్నతుంబళం, వివిధ గ్రామాల ముస్లింలు వక్ఫ్బోర్డు భూముల విషయంపై డిప్యూటీ సీఎంతో చర్చించారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డు ముతవల్లి విభాగపు మెంబర్ ఖాజాసాబ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ప్రహాల్లాదచారి, సింగల్ విండో అధ్యక్షుడు దాట్ల కృష్ణంరాజు, మాజీ అధ్యక్షుడు వీరసేనరెడ్డి, వైఎస్ ఎంపీపీ బుజ్జిస్వామి, సర్పంచ్ పాల్దినకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య, నాయకులు ఉప్పరహాల్ ఏకాంబర్రెడ్డి, సుబ్బారాజు, చౌదరి బసవ, విద్యా కమిటీ చైర్మన్ వడ్డెరాము తదితరలు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీకలు దర్గాలు
● అజ్మీర్ దర్గా పీఠాధిపతి
మతసామరస్యానికి దర్గాలు ప్రతీకలుగా నిలిచాయని అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా ప్రధాన పీఠాధిపతి సయ్యద్ నసురుద్దీన్ చిష్తీ, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ అన్నారు. కౌతాళంలోని జగద్గురు ఖాదర్లింగ స్వామి దర్గా ఆవరణలో నిర్మించిన నూతన మసీదును వివిధ దర్గాల పీఠాధిపతులతో కలసి వారు ఆదివారం రాత్రి ప్రారంభించారు. ముందుగా ఖాదర్లింగస్వామి దర్గాలో ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చిష్తీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దర్గాలో మతసామరస్యం కనిపిస్తోందన్నారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా ఒకే చోటకు చేరే స్థలం దర్గాలే అన్నారు. అందరూ కులమతాలకు అతీతంగా కలసిమెలసి ఉన్నప్పుడే మంచి సమాజాన్ని స్థాపించవచ్చు అన్నారు. సమాజంలో మంచిని, శాంతిని, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. గుల్బార్గ్ బందెనవాజ్ దర్గా పీఠాధిపతి సయ్యద్ గౌసుధరజ్ ఖుస్రు హుసేని చిష్తీ, బీదర్ అబుల్ ఫయ్యాజ్ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అసదుల్లా హుసేని, వివిధ దర్గాల పీఠాధిపతులు తమ సందేశాన్ని ఇచ్చారు. జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్ నియాజ్అహ్మద్, గుల్షన్ కమిటీ అధ్యక్షుడు చిన్న మున్నపాషా చిష్తీ పాల్గొన్నారు.