కర్నూలు(అగ్రికల్చర్): సిపారస్సు మేరకే పురుగు మందులు పిచికారీ చేసేలా రైతుల్లో అవగాహన పెంచాలని నంద్యాల జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామకృష్ణరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో దేశీ డిప్లమా కోర్సు కింద ఇన్పుట్ డీలర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పురుగుమందుల వినియోగంపై సూచనలు చేశారు. నూతన పురుగు మందులు సిఫారసు చేసిన మొతాదుకు మించి వాడటం వల్ల పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకుంటాయన్నారు. రైతులు ప్రతి అవసరానికి డీలర్ల వద్దకే వస్తుంటారని, పురుగుమందుల వినియోగంపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో దేశీ డిప్లమా కోర్సు సమన్వయకర్త, విశ్రాంత జేడీఏ జయచంద్ర, ఇన్పుట్ డీలర్లు పాల్గొన్నారు.
ఏపీ మహిళా సమాఖ్య
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా గిడ్డమ్మ, శ్రావణి
కర్నూలు(సెంట్రల్): ఏపీ మహిళా సమైఖ్య జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ, శ్రావణిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు జె.లలితమ్మ తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో సీపీఐ కార్యాలయంలో ఏపీ మహిళా సమైఖ్య 19వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సభల్లో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 9 మంది ఆఫీసు బేరర్లు, 25 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలుగా జె.లలితమ్మ ఎంపికయ్యారు.
బోరు బండిలో
చెలరేగిన మంటలు
కృష్ణగిరి: మండల పరిధిలోని ఆలంకొండ గ్రామ పొలాల్లో బోరు రిగ్గు వేస్తున్న బండికి సపోర్టుగా ఉండే మరో వాహనంలో సోమవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మూలింటి సుధాకర్ తన పొలంలో బోరు వేయించేందుకు మధ్యవర్తి ద్వారా బోరు బండిని పిలుపించుకున్నారు. బోరు వేస్తున్న సమయలో పక్కనున్న బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి వారంతా ఆ వాహనంలో గ్యాస్ ఉంటుందనే భయంతో పరుగులు పెట్టారు. నిప్పంటుకున్న వాహనాన్ని డ్రైవర్ సమీపంలోని నీటి కాల్వ వద్దకు తీసుకురాగా అక్కడి పంట పొలాల్లో ఉన్న వారంతా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని డోన్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో వాహనదారుడికి సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.