ఓటరు జాబితాలోని పొరపాట్లను సరిచేసేందుకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): ముసాయిదా ఓటరు జాబితా లోని పొరపాట్లను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్వో కె.మధుసూదనరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన చాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఓటరు జాబితా సవరణపై బీఎల్ఓలతోపాటు ఇంటింటా సర్వేలో పాల్గొనాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని, చనిపోయినవారి ఓట్లను పంచనామా చేసి తొలగిస్తామన్నారు. . కాగా, రాజకీయపార్టీల ప్రతినిధులు అడిగిన సమాచారాన్ని వారికి అందజేయాలని, ప్రత్యేక ఓటరు అవగాహన కార్యక్రమాన్ని డిసెంబర్ 2,3తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కర్నూలుకు సమీపంలోని తెలంగాణ జిల్లాల్లో వారికి కర్నూలు జిల్లాలో ఓటు అక్కడ..ఇక్కడ ఉంటే తొలగిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 27న ఓటరు జాబితా పర్యవేక్షుకులు మురళీధర్రెడ్డి ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి పుల్లారెడ్డి, టీడీపీ తరఫున ఎల్వీ ప్రసాదు, ఆమ్ఆద్మీ నుంచి మహ్మద్ అక్బర్, బీజేపీ నుంచి పీటీ సాయి ప్రసాదు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.