గడివేముల: ఓ కూరగాయల వ్యాపారి బతుకు బాటలో మృత్యుఒడికి చేరాడు. కుమారుడితో కలిసి కూరగాయలు విక్రయించేందుకు బయలుదేరిన అతడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండల పరిధిలోని బూజునూరు వైఎన్ పెట్రోల్బంకు వద్ద బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. గడివేముల మండల కేంద్రానికి చెందిన అబ్దుల్రజాక్ (45) ఆటోలో కూరగాయాలు వేసుకుని పల్లెలకు తిరిగి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజూలాగే కుమారుడు అజ్మతుల్లాతో కలిసి అబ్డుల్ రజాక్ బుధవారం తెల్లవారుజామునే కూరగాయాల ఆటోతో పల్లెలకు బయలుదేరాడు. స్థానిక వైఎన్ రెడ్డి పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నంద్యాల నుంచి జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో అబ్దుల్ రజాక్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు అజ్మతుల్లా తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు అజ్మతుల్లాను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ గంగోలు నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.
ద్విచక్రవాహనాల ఢీ
● ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఆదోనిఅర్బన్: పట్టణంలోని ఆలూరు రోడ్డు శంకర్నగర్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. కల్లుబావి కాలనీకి చెందిన నరసప్ప(43) హమాలీ పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. భాస్కర్రెడ్డి కాలనీకి చెందిన చంద్రశేఖర్ పాత బస్టాండు వద్ద గోబీ పాయింట్కు వెళ్తుండగా శంకర్నగర్ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నరసప్ప అక్కడికక్కడే మృతిచెందగా చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రడిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.