లారీ డ్రైవర్‌ సజీవ దహనం | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌ సజీవ దహనం

Published Tue, Apr 23 2024 8:15 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్యాంకర్‌  - Sakshi

ఆస్పరి: మండలంలోని చిన్నహోతూరు గ్రామం దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని సిమెంట్‌ తరలిస్తున్న ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌ నజీర్‌ (32) సజీవ దహనం అయ్యారు. సోమవారం ఆస్పరి సీఐ హనుమంతప్ప చెప్పిన వివరాలు మేరకు.. ఆదివారం రాత్రి బళ్లారి నుంచి సిమెంట్‌ చిప్స్‌ లోడుతో వస్తున్న లారీ డ్రైవర్‌ చిన్నహోతూరు గ్రామం దగ్గర ఆపారు. బళ్లారి నుంచి హైదరాబాద్‌కు సిమెంట్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ క్యాబిన్‌లోని నుంచి క్షణాల్లో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ నజీర్‌ కేకలు వేయడంతో గ్రామస్తులు, ఆటు వైపు వస్తున్న వాహనాల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కళ్ల ముందే డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. ఆస్పరి సీఐ హనుమంతప్ప ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలూరు నుంచి అగ్ని మాపక దళ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం తరువాత బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. మృతి చెందిన నజీర్‌ది హర్యానా రాష్ట్రం కాగా.. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement