డోర్నకల్: డోర్నకల్తో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం పెనుగాలులతో కూడిన వాన కురిసింది. గాలికి బైపాస్ రోడ్డులోని పలు దుకాణాల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. సమ్మర్ స్టోరేజీ ప్రాంతం నుంచి మున్నేరు వాగు బ్రిడ్జి వరకు రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్నేరువాగు సమీపంలోని బట్టీల్లోకి వదరనీరు రావడంతో ఇటుకలు నీట మునిగాయి. బట్టీల ఆవరణలో కూలీలు ఏర్పాటు చేసుకున్న ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో ఇళ్లలోని సామగ్రి తడిసిముద్దయింది. చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన తీగలపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు.
తడిసిన మిర్చి..
గార్ల: అకాల వర్షంతో మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. గురువారం కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు తమ మిర్చి రాశులపై టార్పాలిన్లు కప్పుకోగా.. మరికొందరు పట్టాలు కప్పలేదు. దీంతో మిర్చి తడిసిపోయింది. గార్లలోని బెస్తబజారు, జెండాబజారు, వ్యవసాయ కార్యాలయం వీధిలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది.