చెన్నారావుపేట: పోయిన చోటో వెతుక్కోవాలనుకున్నాడు. వరుసగా రెండేళ్లు వ్యవసాయంలో నష్టాలు రావడంతో తమ పూర్వీకులు గతంలో ఇంటి ఆవరణలో పెంచుకున్న కోళ్ల పెంపకం అతడికి గుర్తుకొచ్చింది. ప్రస్తుతం ఫామ్ కోళ్ల కంటే నాటు కోళ్లకు, కడక్నాథ్ కోళ్లకు డిమాండ్ ఉండడంతో వ్యవసాయంతో పాటు నాటు కోళ్లపై దృష్టి పెట్టాడు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లీ గ్రామానికి చెందిన రైతు కాట కుమారస్వామి.
నష్టం నుంచి లాభాల్లోకి..
కుమారస్వామి మూడెకరాల్లో వ్యవసాయం చేసేవాడు. మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలతో పాటు పలు రకాల పంటలు పండించేవాడు. గత రెండేళ్లుగా పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు వైరస్, చీడ పురుగులతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో సమాజంలో నాటు కోళ్లకు ఉన్న డిమాండ్తో ఇంటి ఆవరణలో షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు.
మొదటి విడతలో..
గతేడాది జూన్లో హైదరాబాద్ నుంచి 500 కోడి పిల్లలు తెచ్చి పెంచాడు. కోడి పిల్లలకు, వాటికి దాణా ఖర్చులు నాలుగు నెలలకు రూ.70 వెచ్చించాడు. వాటిని విక్రయిస్తే రూ.1.30 లక్షలు వచ్చాయి.
పెరిగిన కోళ్ల పెంపకం..
మొదటిసారిగా ప్రయత్నం చేసి లాభాలు రావడంతో ఇంటి వద్ద ఉన్న షెడ్తో పాటు వ్యవసాయ బావి వద్ద మరో షెడ్ వేశాడు. అప్పటి నుంచి నెలకు ఒక బ్యాచ్ (500 పిల్లలు) చొప్పున తెచ్చి ఇప్పటి వరకు ఏడు బ్యాచ్ల కోళ్లు విక్రయించాడు. నాటు కోళ్లతో పాటు సుమారు 100 వరకు కడక్నాథ్ కోళ్లు తెచ్చి విక్రయించాడు. మార్కెట్లో నాటు కోళ్లకు రూ. 250 నుంచి రూ. 500 వరకు డిమాండ్ ఉంది. కడక్నాథ్ కోళ్లకు రూ.600 నుంచి రూ. 2,000 వరకు ధర పలుకుతోంది.