Sakshi News home page

'ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమే' హత్య చేశారా..! అసలేం జరిగింది..??

Published Mon, Sep 11 2023 1:28 AM

- - Sakshi

మహబూబాబాద్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడిని ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం కొట్టి చంపి కుంటలో పడవేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్సై నైనాల నగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేలకుంటకు చెందిన మూడు స్వామి(33)కి అదే గ్రామానికి జ్యోతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

కొంతకాలంగా స్వామి మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం భార్య జ్యోతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి గారింటికి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం నుంచి అతను కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం రేలకుంట శివారులోని పుల్లమ్మకుంటలో మృతదేహం కనిపించింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని విలపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వామికి ఇన్సూరెన్స్‌ చేయించి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement