● కలెక్టర్ శశాంక
మహబూబాబాద్: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులను అప్రమత్తం చేస్తూ.. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూమ్ను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఇరా సింఘాల్, వ్యయ పరిశీలకులు బాబురాయ, పోలీస్ అబ్జర్వర్ ఆకాష్ తోమర్తో కలిసి కలెక్టర్ సందర్శించి, కంట్రోల్ రూమ్ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు పూర్తిస్థాయిలో విధులు అప్పగించి, పర్యవేక్షణ చేపడుతున్నామన్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయన్నాని, 4,72,602 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు 12,691 మందిని గుర్తించామన్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి 12డీ ఫాంలు అందించామని తెలిపారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉండగా 27 కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మానుకోట నియోజకవర్గంలో 283 కేంద్రాలు ఉండగా 34 కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ఉన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లు ప్రణాళికతో చేపట్టాలి..
మహబూబాబాద్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక ఆదేశించారు. మానుకోటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లాలోని డోర్నకల్, మానుకోట నియోజవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత, ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు, ఎన్నికల అధికారులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారం డీపీఆర్ఓకు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్పీ సత్యనారాయణ, అధికారులు నరసింహమూర్తి, భగవాన్ రెడ్డి, సునీల్రెడ్డి, రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ
జిల్లాలో నెల రోజుల్లో 56,000 ఎపిక్ కార్డులను పోస్టల్ శాఖద్వారా నేరుగా ఓటర్ల ఇంటికి పంపించామని కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అఖిలపక్ష ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తీరును వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 3నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ప్రభుత్వం సూచించిన 16 ఆధారాలలో ఏ ఒక్కటైనా వెంట తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. శనివా రం నుంచి ఓటర్ స్లిప్స్ పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.