మహబూబాబాద్ రూరల్ : క్షణికావేశంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం రోటిబండ తండా జీపీ పరిధి దూదియా తండాలో జరిగింది. రూరల్ ఎస్సై బి.రాంచరణ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన తేజావత్ శ్రీను (30)కు భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీను రెండు రోజుల క్రితం జరిగిన ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్లి ఇంటికి వచ్చాడు. ఆ రాకపోకలకు సంబంధించిన డబ్బును అడిగేందుకుగాను సంబంధిత బాధ్యుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో మాటమాట పెరిగి శ్రీను స్థానికులైన రాము, మౌనికతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మౌనికపై చేయి చేసుకున్నాడు. ఆ విషయమై మంగళవారం ఎక్కడ పెద్దమనుషుల వద్దకు పిలిపిస్తారోననే భయాందోళనకు గురై క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి..
మహబూబాబాద్ రూరల్ : అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ కౌలు రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు గ్రామ శివారు చంద్రనగర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ చెందిన గుగులోతు సురేశ్ (36).. భూక్య రమేష్ వద్ద 5 ఎకరాలు, బోడ కమల వద్ద 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వరి, పత్తి, మిర్చి పంటల సాగుకు మొత్తం సుమారు రూ. 6 లక్షల పైచిలుకు అప్పు అయింది. పంటలు దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా నష్టం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సురేశ్ ఈనెల 26వ తేదీన గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లి శాంతి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉంది. ఈ ఘటనపై మృతుడి తండ్రి బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నామని కురవి ఎస్సై బైరు గోపి తెలిపారు.
చెరువులో పడి ఒకరు..
మహాముత్తారం : చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మహాముత్తారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన అజ్మీరా రవీందర్(45) బుధవారం పోలీస్స్టేషన్ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జైపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.