మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో స్థానికులు ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల నుంచి తల్లి తన ఇద్దరు పిల్లల (బాబు, పాప)ను తీసుకువచ్చి భద్రాచలం వెళ్లేందుకు వైఎస్సార్ సెంటర్లో బస్సు కోసం వేచి చూస్తోంది. పిల్లలు స్కూల్ డ్రెస్సులలో ఉండడంతో పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద తల్లి ఆ పిల్లలకు దుస్తులు మారుస్తోంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తన చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భావించిన తల్లి.. అప్రమత్తంగా వ్యవహరించి కేకలు వేసింది. గమనించిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. వెంటనే టౌన్ ఎస్సై రామారావుకు సమాచారం అందించడంతో బ్లూకోల్ట్స్ పీసీలు సక్రాం, వీరన్న అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా కత్తి (సీలింగ్ పనులకు వినియోగించే ఇనుప వస్తువు) లభించింది. అతడిని పోలీసు స్టేషన్కు తరలించి విచారణ జరిపారు. సదరు వ్యక్తి కిడ్నాపర్ కాదని, బిహార్కు చెందిన చందన్ శర్మ అని, ఆర్తి గార్డెన్స్ ఆవరణలో సీలింగ్ పనులు చేయడానికి వచ్చాడని టౌన్ ఎస్సై రామారావు తెలిపారు. మద్యం మత్తులో ఆ బాలిక తన కుమార్తెలా ఉందని భావించి పట్టుకోగానే చిన్నారిని తల్లి భయపడిందని ఎస్సై పేర్కొన్నారు.