మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షత అభయారణ్యం తరచుగా అగ్నికి ఆహుతి అవుతుండగా తాజాగా మంగళవారం అనేక ప్రాంతాల్లోని అడవులు అగ్నికి ఆహుతి అయిన సంఘటన చోటుచేసుకుంది. మన్ననూర్ రేంజ్ పరిధిలో ఫరహాబాద్ సౌత్, తుర్కపల్లి సెక్షన్, దోమలపెంట రేంజ్లో అక్కమదేవి, తాటిగుండాలు, అమ్రాబాద్ రేంజ్లో బోరెడ్డిబావి శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి తదితర 15చోట్ల అడవికి నిప్పు అంటుకుంది. సంఘటనలో 70 మంది అటవీ సిబ్బందితో పాటు అమ్రాబాద్ ఫైర్ సిబ్బంది పాల్గొని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సుమారు 9గంటల నుంచి సాయింత్రం 4గంటల వరకు మంటలను అదుపు చేయగలిగారు. వేసవి కావడంతో అడవి మొత్తం ఎక్కడ చూసినా ఎండుఆకులు, గడ్డితో నిండుకుని ఉండటంతో వందల ఎకరాల్లో అడవి కాలిపోయినట్లు తెలిసింది.