మదనాపురం: మండలంలోని సరళసాగర్ ఎడమ కాల్వ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాల్వ పొడవున చెత్త, ముళ్ల కంప పేరుకుపోయింది. దీంతో నీరు దిగువ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎడమ కాల్వ ద్వారానే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
9 గ్రామాలకు 3,800 ఎకరాలు
సరళాసాగర్ ప్రాజెక్టు ద్వారా 3,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 2వేల ఎకరాలు మాత్రమే అందుతుంది. కరమ్మ పేట, దంతనూరు, మదనాపురం, రామన్పాడు, నెలివిడి తిరుమలపల్లి, అజ్జకొల్లు, కొత్తకోట మండలంలోని వడ్డెవాట, చర్లపల్లి గ్రామాల్లో కాల్వ ఉంది. కాల్వ పొడవునా మొదటి నుంచి చివరి ఆయకట్టు వరకు కాల్వ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు ఉన్నాయి. కుడి, ఎడమ వైపు ముళ్ల కంప, చెత్త పేరుకపోయింది. ఎడమ కాల్వకు ఉన్న రామన్పాడు డిస్ట్రిబ్యూటర్ల కాల్వ కనపించడం లేదు.
10ఏళ్లుగా పట్టించుకునేవారు కరువు
నీటి పారుదలశాఖ అధికారులు కాల్వలపై దృష్టి పెట్టడం లేదు. ఎప్పటికప్పుడు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తేనే మొదటి నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు ఇబ్బంది లేకుండా వెళ్తుంది. కానీ ఇక్కడ నిబంధనలు గాలికి వదిలేశారు. 10ఏళ్లుగా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కాల్వల పరిస్థితి ఈవిధంగా తయారైందని రైతులు అంటున్నారు.
పట్టించుకోవడం లేదు..
సరళాసాగర్ కాల్వపై అధికారుల పట్టించుకోవడం లేదు. అనేక చోట్ల లీకేజీలు ఉన్నాయి. కాల్వల నిండా చెత్త పేరుకుపోయింది. ఏళ్లుగా శుభ్రం చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి.
– అంజద్అలీ, రామన్పాడు
శిథిలావస్థకు..
సరళాసాగర్ ఎడమ కాల్వ శిథిలావస్థకు చేరింది. ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు లీకేజీల కారణంగా పూర్తి స్థాయిలో వెళ్లడం లేదు. కాల్వ నిండా మట్టి, ముళ్లపొదలు అలుముకున్నాయి. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– మొగిలి, అజ్జకొల్లు
కాల్వలను శుభ్రం చేస్తాం
సరళాసాగర్ ఎడమ కాల్వ డిస్ట్రిబ్యూటర్ కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో శుభ్రం చేయించాలని ఎంపీడీఓకు విన్నవించాం. వారి సహకారంతో తప్పకుండా కాల్వలను శుభ్రం చేస్తాం.
– అనిల్రెడ్డి, నీటిపారుల శాఖ ఏఈ,
సరళాసాగర్
సరళాసాగర్ ఎడమ కాల్వలో
పేరుకుపోయిన చెత్త
వృథాగా వెళ్తున్న నీరు