జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వ హించేలా అధికారులు పనిచేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి సంజయ్కుమార్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్లోని స మావేశ మందిరంలో జిల్లాకు కేటాయించిన వ్యయ పరిశీలకులు కుందన్యాదవ్, జీవీ తేజస్వి, పోలీస్ అబ్జర్వర్, ఐపీఎస్ అధికారి ఇళక్కియా కరుణాగరన్లతో కలిసి ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్, నోడల్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికలకు సంబంధించిన అధికారులు అందరూ కృషిచేయాలన్నారు. కలెక్టర్ రవినాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు, అలాగే పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లపై వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్ ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు, సిబ్బంది నియామకం తదితర అంశాలను వివరించారు. అనంతరం వారు ఎంసీఎంసీ కేంద్రాన్ని, అలాగే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. సమావేశంలో జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర రిటర్నింగ్ అధికారులు మోహన్రావు, అనిల్కుమార్, నటరాజ్, డీఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
భూత్పూర్: మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్ కుమార్మిశ్రా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.