మహబూబ్నగర్ క్రైం: విద్యార్థులు వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా చదువులపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మాడల్ బేసిక్ ప్రాక్టీస్ హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని, అప్పుడే భవిష్యత్ బాగుంటుందన్నారు. అనంతరం బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు పుట్టపాగ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
స్టేషన్ మహబూబ్నగర్: ఎన్నికల నేపథ్యంలో జిల్లాకేంద్రానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, అనిత అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా నియామకం అయ్యారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా మధుసూదన్రెడ్డి, నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా అనిత నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రయాణికుల ఫిర్యాదులు పరిశీలిస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: డయల్ యువర్ డీఎంకు వచ్చిన ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనలను పరిశీలిస్తామని డిపో మేనేజర్ సుజాత అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించి ప్రయాణికుల నుంచి ఆర్టీసీకి సంబంధించిన ఫిర్యాదులు తీసుకున్నారు. మహబూబ్నగర్ నుంచి కోదాడకు బస్సులు పెంచాలని, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు వచ్చేటప్పుడు వెంకటేశ్వరకాలనీలో బస్సులు ఆపాలని కోరారు. కూచూరుకు బస్సు నడపాలని, మహబూబ్నగర్ నుంచి గుల్బర్గ బస్సును పునరుద్ధరించాలని, ముచ్చింతల నుంచి హైదరాబాద్కు బస్సు నడపాలని, కల్వకుర్తి బస్సులను ఏనుగొండలో ఆపాలని ప్రయాణికులు ఫోన్లో కోరగా పరిశీలిస్తామని తెలిపారు.
పీయూ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో మంగళవారం షటిల్ జట్టును ఎంపిక చేశారు. పీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన 10మంది విద్యార్థులు హాజరయ్యారు. పీయూ జట్టుకు ఎంపికై న విద్యార్థులు వచ్చేనెలలో వెళ్లూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్జోన్ షటిల్ టోర్నీలో పాల్గొంటారని పీడీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వెంకటేష్, గాలెన్న పాల్గొన్నారు.
చెక్పోస్టు తనిఖీ
చిన్నచింతకుంట: మండలంలోని లాల్కోట చౌరస్తాలో రాయచూరు–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఎన్నికల పోలీస్ పరిశీలన అధికారి ఇలైక్య కరుణాగరన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్పోస్టు వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాల తనిఖీలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని తెలిపారు. ఎస్ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.