మహబూబ్నగర్ న్యూటౌన్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్కుమార్మిశ్రా, మహబూబ్నగర్ వ్యయ పరిశీలకులు కుందన్యాదవ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఈ నెల 30న నిర్వహించనున్న పోలింగ్ ఏర్పాట్లపై మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్కు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లకు కల్పించాల్సిన వసతులపై ఆరాతీశారు. పోలింగ్ రోజు కంట్రోల్ రూం ఏర్పాటు, ఈవీఎం, వీవీప్యాట్లపై భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు రవాణా సౌకర్యం, పోలింగ్ శాతం, ఎన్నికలలో పాల్గొంటున్న సిబ్బంది ఫోన్ నంబర్ల సేకరణ, సూక్ష్మ పరిశీలకుల శిక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు అనిల్కుమార్, మోహన్రావు, నటరాజ్ పాల్గొన్నారు.
సౌకర్యాల పరిశీలన
రాజాపూర్: పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాల ఏర్పాటును ఎన్నికల పరిశీలకులు సంజయ్కుమార్మిశ్రా రాజాపూర్లోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా స్టెచర్స్ అన్ని కేంద్రాల్లో ఉన్నాయా అని తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇప్పటి వరకు పది మంది వృద్ధులు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 10 మంది ఓటేశారని తహసీల్దార్ వివరించారు.