Telangana News:
Sakshi News home page

ఓటర్లకు గాలం.. అయినా గెలుస్తామ్మన్న ధీమా తక్కువే

Published Sat, Nov 25 2023 1:38 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఆయా పార్టీ అభ్యర్థులు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీశారు. ప్రలోభాలే ఓటు బలంగా భావిస్తూ.. ఓటుకు నోటు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓటు బలాన్ని.. నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల 30న ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కంటే ముందే అభ్యర్థుల దృష్టి అంతా ఓటర్ల చెంతకు నోట్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తుగానే నగదును ఆయా గ్రామాలు, వార్డులకు తరలిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు కొన్ని ప్రాంతాల్లో సాఫీగా ఈ ప్రక్రియ సాగించారు. కొన్నిచోట్ల పార్టీల పంపకాలు పేచీలకు ఆజ్యం పోస్తున్నాయి. నువ్వా.. నేనా అంటూ సాగే ఎన్నికల పోరులో దండిగా డబ్బులు వస్తాయని ఆశించామని, పరిస్థితి వేరేలా ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు ఎంత ఇస్తారంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వాలనే చర్చ జోరుగా సాగుతుంది. ఇంకొన్ని చోట్ల పక్కా హామీలతో డబ్బు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటు నజరానాలు అందజేశారు. అయితే ఈ పంపకాలను కొందరు ఓటర్లు సహించడం లేదు. మేమేంటో చూపిస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ శపథాలు చేస్తున్నారు.

పైకి ధీమా.. లోలోపల దిగులు
ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. పోలింగ్‌ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. ఓటు బాసలు చేయించుకుంటూ.. నోటు ఊసులు చెప్పుకొంటున్నారు. కానీ, ఓటరు నాడి పట్టుకోవడంలో ఊగిసలాట కొనసాగుతోంది. పంపకాల పేచీలు ఏమైనా కలవరపాటు గురి చేస్తాయా అంటూ ఆందోళనలో ఉన్నారు.

ఒక్క ఓటుకు రూ.వెయ్యి, రూ.2వేలు ఇచ్చినా.. చివరికి మాకే వేస్తారా? అనే సంశయం వ్యక్తమవుతోంది. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఇది ఒక దఫా మాత్రమే.. ఇంకా 4రోజుల సమయం ఉంది కదా.. కంగారు పడకండి అంటూ ఓటర్లను సముదాయించే పనిలో నిమగ్నమవుతున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలోపు మీకు నజరానాలు అందుతాయంటూ ఆశ పెడుతున్నారు.

భారీగా మద్యం నిల్వలు
ఈ ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి రాజకీయ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణంలో రూ.10 లక్షల వరకు స్టాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీస్థాయిలో నిఘా కొనసాగుతున్నా ఓటర్లకు మాత్రం మద్యం చేర్చుతున్నారు. కొందరు నాయకులు కార్యక్తలకు చీటీలు ఇస్తే.. మరికొందరు టోకెన్లు, మరి కొందరు నేరుగా ఇంటింటికి తిరిగి మద్యం బాటిళ్లు అందిస్తున్నారు.

దీంట్లో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాలకు ద్విచక్రవాహనాల సహాయంతో మద్యం తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కేవలం కూలీలు, రైతులు, మధ్యతరగతి వారికి చీప్‌ లిక్కర్‌, క్వాటర్స్‌, కొంత రిచ్‌నెస్‌ ఉన్న వ్యక్తులకు బ్రాండెడ్‌ బాటిళ్లు ముట్టజెప్పుతున్నారు. ఇక పల్లెల్లో ఓటర్లకు ఇవ్వడానికి రూ.500, 200 నోట్లు భారీస్థాయిలో సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

పార్టీల వారీగా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరినీ ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. సర్వేలతో మూడు పార్టీల నాయకుల ఆయా బూత్‌ల వారీగా నిర్ధారించుకున్నారు. ఆ మేరకు మాత్రమే డబ్బు అందజేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇది చదవండి: నియోజకవర్గ అభివృద్ధిని చూసి.. ఓటు వేసేందుకు కెనడా నుంచి స్వదేశానికి..!

Advertisement
Advertisement