జడ్చర్ల టౌన్: ప్రతి రికార్డును సక్రమంగా నిర్వహించాలని స్కూల్ కాంప్లెక్స్ సమావేశ రాష్ట్ర పరిశీలకుడు కృష్ణమోహన్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం బాదేపల్లి బాలికల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన తెలుగు స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హజరయ్యారు. పాఠ్యాంశాల బోధనలో తీసుకోవాల్సిన మెళకువలను వివరించారు. ఎవరైనా రాష్ట్ర పరిశీలకులు పాఠశాలలు సందర్శించే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఏఏ రికార్డులు నిర్వహించాలో వారికి అవగాహన కల్పించారు. బోధనను సైతం పరిశీలకులు పరిశీలించే ఆస్కారం ఉన్నందున పాఠ్యాంశాల బోధన ఎలా చేయాలో చేసి చూయించారు. సమావేశంలో భాగంగా నసురుల్లాబాద్ ఉపాధ్యాయుడు తిమోతి మాదిరి పాఠ్యాంశం బోధన చేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మి మాట్లాడుతూ 6 నుంచి 9వ తరగతి వరకు పాఠ్యాంశాల బోధన, విద్యార్థులకు మంచి ఫలితాలు రాబట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వివరించారు. ముఖ్యంగా ఉన్నతి కార్యక్రమానికి సంబంధించి ఉపాధ్యాయులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు నాలుగు జట్లుగా ఏర్పడి రాబోయే తరగతుల్లో పాఠ్యాంశాల బోధన ఎలా ఉండాలనే ప్రణాళికలు రూపొందించారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంను ఇతర ఉపాధ్యాయులు సత్కరించారు.