పాముకాటుతోవ్యక్తి మృతి.. ఇంకా.. | Sakshi
Sakshi News home page

పాముకాటుతోవ్యక్తి మృతి.. ఇంకా..

Published Mon, Dec 11 2023 12:30 AM

- - Sakshi

హన్వాడ: పాముకాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం మండలంలోని వేపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొత్త చెన్నయ్య (45) మూడురోజుల కిందట రోజులాగే పొలానికి వెళ్లగా గట్టుపై పాము కాటువేసింది.

వెంటనే కుటుంబసభ్యులు నారాయణపేట జిల్లా గుండుమాల్‌ మండలం కొమ్మూర్‌లోని నాటువైద్యుడికి చూపించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కొత్త చెన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలోమరొకరు..
గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తెలుగు కృష్ణ (48) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అయితే దౌదర్‌పల్లికాలనీకి చెందిన వెంకటలక్ష్మితో 25ఏళ్ల క్రితం వివాహమైంది. ఇరువురి మధ్య కొన్నేళ్ల క్రితమే కుటుంబ సమస్యల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో కృష్ణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లోకి వెళ్లి కృష్ణ ఆదివారం ఉదయం 10గంటలైన బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికిలో నుంచి చూడగా ఉరేసుకుని ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మందిపల్లిలో యువకుడు..
మరికల్‌:
పెళ్లి జరిగిన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించి ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన విష్ణువర్ధన్‌(30)కు ఆరు నెలల కిందట వివాహమైంది.

రెండు రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరే ముందు, గొర్రెల వద్దకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆదివారం సొంత పొలం వద్దకు వెళ్లిన తండ్రికి నీటి గుంత గట్టుపై కుమారుడి దుస్తులు, చెప్పులు, ఫోన్‌ కనిపించింది.

ఆయన నీటి గుంతలో పరిశీలించగా.. కుమారుడి మృతదేహం కనిపించింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్‌ క్రైం:
రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఎస్‌ఐ సయ్యద్‌ అక్బర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్‌ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని మహిళ(35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement