మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడంతో పాటు కొత్త లబ్ధిదారులను గుర్తింపులో భాగంగా అవగాహన నిమిత్తం ఈ నెల 16 నుంచి జనవరి 26వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర రక్షణశాఖ జాయిట్ సెక్రెటరీ వేద్ వీర్ ఆర్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు మౌలిక వసతులు పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, దీపం కనెక్షన్లు, ఇళ్లు, పౌష్టికాహారం, విద్యా, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో భాగంగా అవేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులకు ఈ పథకాలు చేరాయా లేదా అని, అలాగే కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు ఆరు ప్రచార వాహనాలను కేటాయించామని, ఈ వాహనాలు ప్రతి రోజు రెండు గ్రామాల్లో తిరిగే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ అన్నయోజన, పీఎం ఉజ్వల్ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్ సమ్మాన్, కిసాన్ క్రెడిట్, పోషణ అభియాన్, హార్ఘర్ జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన.. తదితర పథకాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతం చేసేందుకు సహకారం అందించాలన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లాకు నోడల్ అధికారి, మండలాల వారీగా నోడల్ అధికారులను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని, అదే సమయంలో బాలానగర్ మండలం పెద్దాయిపల్లిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పెట్రోలియం, యువజన సర్వీసులు, మహిళా శిశుసంక్షేమం, సహకార, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆయుష్ గృహ నిర్మాణ శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఆర్డీఓ యాదయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి జనవరి 26వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీవేద్వీర్ ఆర్య