మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి విద్యార్థినులకు పురుగులు, వెంట్రుకలతో కూడిన అన్నం వడ్డించడంపై మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమశాఖ డీడీ పాండుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీడీ.. బుధవారం సంబంధిత హాస్టల్లో విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా సిబ్బంది విధినిర్వహణపై ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థినులకు నాసిరకంగా భోజనం అందిస్తున్నారని ఆయన తేల్చారు. దీంతో ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై డీడీని వివరణ కోరగా.. హాస్టల్లో వార్డెన్ వంట సామగ్రి సక్రమంగా ఇస్తున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
విధులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు