నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): సార్వత్రిక ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా 1,500 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి ఇచ్చారు. అయితే జిల్లాకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో డబ్బు, మద్యం అధికంగా రవాణా అవుతోందని, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని 2,204 కేంద్రాలకు వెబ్కాస్టింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ లేఖరాశారు. ఇటీవల అక్కడి నుంచి అనుమతి ఇస్తూ ఆదేశాలు రావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
వెలుపల, లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు
వెబ్కాస్టింగ్లో భాగంగా పోలింగ్ కేంద్రంలో లోపల, బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సులభతరం అవుతుంది. ఇందుకోసం లోపలి దృశ్యాలను రికార్డు చేసేందుకు ఒక్క సీసీ కెమెరాను, బయటి దృశ్యాలను చిత్రీకరించేందుకు మరో సీసీ కెమెరాను అమర్చుతారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు సీసీ కెమెరాలను పంపారు. వీటిని ఈనెల 9, 10వ తేదీల్లో సరైన లోకేషన్లలో అమర్చి వాటిని సంబంధిత నియోజకవర్గ ఆర్వో, కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్, విజయవాడలోని సీఈఓ కార్యాలాయనికి కనెక్ట్ చేస్తారు. దీంతో పోలింగ్ కేంద్రాల లోపల, బయట జరుగుతున్న దృశ్యాలను అప్పటికప్పుడే జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లు, సీఈఓ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వారి కార్యాలయాల నుంచే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే వరకు ప్రతి నిత్యం కేంద్రాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే నివారించేందుకు చర్యలు తీసుకోవడానికి ఎంతో వీలు ఉంటుంది.
సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు..
వెబ్కాస్టింగ్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే పరిష్కరిచేందుకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సాంకేతిక బృందాలు అందుబాటులో ఉండి వచ్చిన టెక్నికల్ సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తాయి. మే 11, 12 తేదీల్లో డ్రై రన్నిర్వహించి పోలింగ్ రోజైన మే 13వ తేదీన ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో
మైక్రో అబ్జర్వర్లు
కర్నూలులో 16, పాణ్యంలో 64, పత్తికొండలో 57, కోడుమూరులో 30, ఎమ్మిగనూరులో 33, మంత్రాలయంలో 25, ఆదోనిలో 49, ఆలూరులో నియోజకవర్గంలో 46 మొత్తం 320 అత్యంత సమస్మాత్మక పోలింగ్కేంద్రాలను గుర్తించారు. అలాగే కర్నూలు 7, పాణ్యంలో 3, కోడుమూరులో 2, మంత్రాలయంలో 2 మొత్తం 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గతంలో నమోదైన క్రైమ్ రిపోర్టు ఆధారంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో మైక్రో అబ్జర్వర్లు ఉండి ప్రతి నిత్యం పోలింగ్ కేంద్రంలో ఏమి జరుగుతుందో అబ్జర్వర్లకు నివేదిక ఇస్తుంటారు. అంతేకాక వీడియో గ్రఫీ కూడా తీయిస్తారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన తక్షణమే అణచి వేసి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని 2,204 పోలింగ్ కేంద్రాల్లో
వెబ్కాస్టింగ్
ప్రతి కేంద్రంలో రెండు అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు