నేటి నుంచి ఆంజనేయస్వామి ఉత్సవాలు ప్రారంభం
ఆలయ చరిత్ర..
ఈ ఆలయానికి సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఆలయం చుట్టుపక్కల చింతచెట్లు ఎక్కువగా ఉండటం.. వాటి కింద రాక్షసులు నివాసం ఉండి మనుషులు, పశువులను చంపి ఆహారంగా భుజించేవారని.. భయభ్రాంతులకులోనైన ప్రజలు తమను రక్షించాలని ఆంజనేయస్వామిని వేడుకోవడంతో స్వామివారు ఇక్కడ కొలువై రాక్షసకాండకు ముగింపు పలికాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాక్షసులు మీరు ఇక్కడ కొలువుదీరితే మాకు ఆహారం ఎలా లభిస్తుందని హనుమంతుడిని వేడుకోవడంతో భక్తులు తనకు నైవేద్యంగా జంతువులను బలిస్తారని.. వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. దీంతోనే ఈ ఆలయంలో భక్తులు స్వామివారికి మాంసహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
పెబ్బేరు రూరల్: ఎక్కడైనా ఆంజనేయస్వామికి సింధూరం, తమలపాకులతో పూజలు నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపల్లి శివారులో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, కల్లుతో నైవేద్యం సమర్పిస్తారు. ఏకంగా స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే ఈ ఉత్సవాలకు స్థానికులేగాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు 17వ తేదీన ముగుస్తాయి. ఇక్కడి స్వామివారికి అపారమైన శక్తి ఉందని.. కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీరంగాపూర్ మొదటి పరిపాలన రాజు వాసుదేవరావు తాను కోరిన కోరిక నెరవేరడంతో ఆలయాన్ని నిర్మించారు.
సౌకర్యాల కల్పన..
ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పెబ్బేరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
మాంసమే నైవేద్యం..
కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కుల చెల్లింపు
17న ముగింపు కార్యక్రమం