ఓటు కోసం ఏడు కిలోమీటర్లు..
● ఊట్ల గిరిజనుల కష్టాలు
దండేపల్లి(మంచిర్యాల): ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఆ గ్రామ గిరిజనులు ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లకతప్పడంలేదు. అర్హులైన ప్రతి ఒక్క రూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు, ప్రభుత్వం విస్తృత ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ఓటు హక్కు వినియోగానికి ప్రజలు పడే ఇబ్బందులు మాత్రం గుర్తించడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాతమామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఊట్ల గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో 22 కుటుంబాల్లో సుమారు 80 మందికి పైగా జనాభా 36 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి తమ గ్రామానికి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లికి వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే రహదారి సౌకర్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై కంకరతేలి అధ్వానంగా ఉంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో వారికి దారికష్టాలు తప్పడంలేదు. ఎన్నికల సమయంలో మాత్రం అభ్యర్థులు ఓటర్లకు వాహనాలు సమకూరుస్తారు. కానీ ఎన్నికల తర్వాత తమను ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండలంలోని మరికొన్ని గిరిజన గ్రామాలకు కూడా పోలింగ్ కేంద్రాలు, రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.