● వలస ఓటర్లపై అభ్యర్థుల గురి
మంచిర్యాలఅర్బన్: ‘అన్నా నమస్తే.. మీపిల్లలు ఎక్కడ ఉంటున్నారు.. మీ ఇంట్లో ఆరోట్లున్నాయి. పిల్లలు దూరప్రాంతాల్లో ఉంటే పిలిపించి ఈసారి ఓటు వేసేలా చూడండి..’ అంటూ అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సెల్ఫోన్ సంభాషణలు షురూ అయ్యాయి. జిల్లాలో ఓటు హక్కు కలిగినవారు వేర్వేరు కారణాలతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడటంతో పోలింగ్ సమయానికి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఒక్క ఓటు గెలుపోటములను తారుమారు చేస్తుంది. దీంతో పోలింగ్ తేదీ సమీపిస్తుండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. కొలువు, చదువు, వివిధ అవసరాలు, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. బదిలీలపై వెళ్లిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అవసరమైన రవాణా ఖర్చులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా నియోజవకర్గంలో ఓటు హక్కు కలిగి వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారి జాబితా సిద్ధం చేసుకున్నారు. ఒకడుగు ముందుకేసి వారిని సెల్ఫోన్లో పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారికి రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు.