● ఆదిలాబాద్ డీఈవో ప్రణీత ● ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
ఆదిలాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలను జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. భరద్వాజ మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, టేబుల్ టెన్నీస్, అథ్లెటిక్స్, చెస్ పోటీలు రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలి పారు. ప్రతిభావంతులు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతారని వెల్లడించారు. అధ్యాపకులు రాజ్కుమార్, వీరస్వామి, సుజై, రాజన్న, సురేశ్, రాజేశ్, కుమారస్వామి, ప్రవీణ్, గజానంద్ పాల్గొన్నారు.