గజ్వేల్‌ మరో డల్లాస్‌.. ఏమైంది? | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ మరో డల్లాస్‌.. ఏమైంది?

Published Tue, Sep 26 2023 7:34 AM

గజ్వేల్‌లో మహిళలతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ - Sakshi

గజ్వేల్‌/తూప్రాన్‌: ‘గజ్వేల్‌ను మరో డల్లాస్‌, లండన్‌, న్యూయార్క్‌ చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు.. ఇక్కడికి వచ్చి చూస్తే అట్ల ఏమీ కనిపిస్తలేదు.. ఉన్న బస్టాండ్‌ను కూలగొట్టి రేకుల షెడ్డును నిర్మించిండ్రు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇంకా పూర్తి చెయ్యలే. గిదేనా..? మీరు చేసిన అభివృద్ధి? ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు.. కామారెడ్డిలో కూడా కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయం’ అని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు.

సోమవారం కామారెడ్డికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా వర్గల్‌ మండలం అనంతగిరిపల్లిలో అర్ధంతరంగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పనులతోపాటు గజ్వేల్‌ పట్టణంలో బస్టాండ్‌, రింగు రోడ్డు, మినీ స్టేడియంను పరిశీలించారు. గజ్వేల్‌ను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు.

మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రకటన ల నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పర్యటిస్తున్నానని చెప్పారు. మంత్రులు చెబుతున్నదానికి ఇక్కడ పరిస్థితికి పొంతన లేదని విమర్శించారు. వర్గల్‌లో పేదలకు కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన 1,200 ఎకరాల భూమిని ఫుడ్‌ పార్కు పేరిట లాక్కుంటున్నారని ఆరోపించారు.

తూప్రాన్‌లో పర్యటన..
మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డితో కలిసి తూప్రాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అల్లాపూర్‌ రోడ్డును పరిశీలించి ఇదే అభివృద్ధి అంటే..? అంటూ విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement