అభ్యర్థుల ఖాతాల్లోకి పార్టీ ఖర్చులు
కౌడిపల్లి(నర్సాపూర్): ఓటు ఉన్న విద్యార్థులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి వద్దగల కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటుహక్కుపై విద్యార్థులు అవగాహన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించారు. విద్యార్థులందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం స్వీప్ నోడల్ అధికారి, డీడబ్ల్యూఓ బ్రహ్మాజీ మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని, వందశాతం ఓటింగ్లో పాల్గొని మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి రాజిరెడ్డి, సీడీపీఓ హేమభార్గవి, ఐసీడీఎస్ నర్సాపూర్, కౌడిపల్లి సూపర్వైజర్లు సరళ, శశికళ, లక్ష్మి, కేవీకే హెడ్ నల్కర్, శాస్త్రవేత్తలు డాక్టర్ భార్గవి, డాక్టర్ ప్రతాప్రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
నర్సాపూర్: చెక్ పోస్టు మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆదేశించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా జాతీయ రహదారిపై నర్సాపూర్ హైదరాబాద్ మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వాహనాల తనిఖీ, పట్టుబడిన నగదు వివరాల రిపోర్టును, చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. చెక్ పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, 24 గంటలు సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక నిఘా కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు మెరుగైన పని తీరును కనబర్చాలని రాజర్షి షా సూచించారు.
స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట బందోబస్తు
స్ట్రాంగ్ రూం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా ఆదేశించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపర్చిన బీవీరాజు ఇంజనీరీంగు కాలేజీలోని స్ట్రాంగ్ రూం వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా భద్రత ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్ రూం వద్ద బందోబస్తు ఏర్పాటు, ఇతర వివరాలను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షాకు స్థానిక ఎన్నికల అధికారులు వివరించారు.
మెదక్ కలెక్టరేట్: రాజకీయ పార్టీల ప్రచార ఖర్చులు, ఇతర కార్యక్రమాల ఖర్చులను అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి నియమావళి వర్తిస్తుందన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు నియమావళి కిట్టు అందజేయడం జరుగుతుందని, దానికనుగుణంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రచార సభలకు, సమావేశాలకు సువిధ యాప్ద్వారా అనుమతులు మంజూరవుతాయని తెలిపారు. వాహనాల పత్రాలు అడిగిన వెంటనే సమర్పించాలని, హెలీప్యాడ్ కోసం స్థల యాజమని పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ, సివిజిల్, కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఓటు హక్కుపై వేసిన ముగ్గుల పరిశీలన
సువిధ యాప్ ద్వారా ప్రచారానికి అనుమతులకు
జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా