కనెక్షన్ వాడుతున్నారో..
లేదో తెలుసుకునేందుకే..
కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈకేవైసీ నిర్వహిస్తున్నాం. ఈనెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉంది. భారత్ గ్యాస్ కనెక్షన్లు 31 వేలు ఉన్నాయి. ఇందులో 3 వేలు ఇన్యాక్టివ్ ఉండగా 28 వేలు యాక్టివ్లో ఉన్నాయి. ఈనెల 8వ తేదీ నుంచి ఈకేవైసీని ప్రారంభించాం. రోజుకు కనీసం 500 వరకు కూడా కావడం లేదు. జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నెలాఖరు వరకు ఈప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు. సమయం పొడిగించే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్ పొందిన వారు సక్రమంగా వాడుతున్నారా? లేదా అని తెలుసుకోవడానికే ఈ ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ ప్రక్రియకు సంబంధం లేదు. – వెంకట్రెడ్డి,
భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు, మెదక్.
మెదక్ కలెక్టరేట్: మెదక్ డివిజన్ పరిధిలోని మహిళలు ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ ఉన్న వారికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.500ల సిలిండర్ ఇస్తారని గ్రామాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈనెలాఖరు వరకే సమయం ఉందని సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ పథకం ఎక్కడ తమకు దక్కదొనని ఆందోళనకు గురవుతున్న జనాలు సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలో మొత్తం 45 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ కనెక్షన్లతోపాటు ఉజ్వల, దీపం పథకానికి సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. మెదక్ పట్టణంతోపాటు, మెదక్ మండలం, హవేళిఘణాపూర్, రామాయంపేట, నిజాంపేట, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట మండలాల లబ్ధిదారులు ఇక్కడ కనెక్షన్లు ఉన్నాయి.