కౌడిపల్లి(నర్సాపూర్): దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని కలెక్టర్ రాహుల్రాజ్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని మహ్మద్నగర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా 210 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఇంకా పలుచోట్ల వరి కోతలు ప్రారంభం కాలేదన్నారు. సోమవారం వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా లారీలు సకాలంలో వచ్చే లా ఏర్పాటు చేయాలని రైతులు కలెక్టర్ను కోరారు. గతంలో లారీలు రాక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏడీఏ పుణ్యవతి, ఏఈఓ దివ్యశ్రీ, మహ్మద్నగర్ పీఏసీఎస్ సీఈఓ దుర్గాగౌడ్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, మాజీ సర్పంచ్ దివ్య, నాయకులు మహిపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకన్న, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా తాగు నీటి సరఫరా
నర్సాపూర్ రూరల్: ప్రణాళికాబద్ధంగా తాగు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని రుస్తుంపేట, లింగాపూర్లో పర్యటించి నీటి సమస్యలపై ఆరా తీశారు. ప్రతి రోజు అధికారులు పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కష్టకాలంలోనే అధికారుల పనితీరు బయటపడుతుందన్నారు. సమస్యలుంటే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బోరు మోటార్లను అద్దె కోసం చూసి పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈలు కమలాకర్, సంపత్కుమార్, నర్సాపూర్ ఎంపీడీఓ మధులత, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్