Shilpa Shetty: మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువునష్టం దావా
Published
Fri, Jul 30 2021 10:14 AM
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా కేసులో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలతో పాటు, పలువురు జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం.
ఇదిలా వుంటే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.