అప్పుడు తనయుడికి.. ఇప్పుడు తండ్రికి.. | Sakshi
Sakshi News home page

ఆచార్యలో ప్రధాన విలన్‌గా అరవింద్‌ స్వామి!

Published Fri, Nov 20 2020 3:47 PM

Aravind Swamy May Plays Main Villain Role In Chiranjeevi Acharya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రోజా’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత ‘ముంబాయి’ వంటి చిత్రాలతో లవర్‌ బాయ్‌గా పెరుతెచ్చుకున్నారు నటుడు అరవింద్‌ స్వామి. అదే విధంగా వెండితెరపై అందగాడిగా అమ్మాయిల మనసు దోచుకున్న అరవింద్‌ స్వామి కొద్ది రోజులకు కనుమరుగయ్యారు. ఇక కొంతకాలనికి విలన్‌గా తిరిగి సెకండ్‌ ఇన్నింగ్‌ మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2016లో వచ్చిన రామ్‌చరణ్‌ ‘ధృవ’ చిత్రంలో విలన్‌గా నటించి విలన్‌గా వందకు వందశాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక పలు సినిమాల్లో కూడా ప్రతినాయకుడిగా నటిస్తూ ఆయన విలన్‌గా సెటిల్‌ ఆయిపోయరు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా ‍కనిపించబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు)

అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం దర్శకుడు కొంతమంది స్టార్‌ విలన్‌లను పరిశీలించగా చివరకు అరవింద్‌ స్వామిని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’లో హీరోకు, విలన్‌కు మధ్య ఉండే సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంట. దీంతో ప్రధాన విలన్‌గా అరవింద్‌ స్వామి కరెక్ట్‌గా సరిపోతారని భావించిన దర్శకుడు ఆయనను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు సినిమా యూనిట్‌ స్పష్టత ఇవ్వలేదు. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలైన లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ షెడ్యూల్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రస్తుతం ‘ఆచార్య’ హైదరాబాద్‌లోని రామోజీ ఫీలిం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. (చదవండి: పారితోషికం తీసుకోవడంలేదు)

Advertisement
Advertisement