Income Tax Dept Raids On Vikas Bahl, Anurag Kashyap And Heroine Tapsee Pannu Residences - Sakshi
Sakshi News home page

అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు

Published Wed, Mar 3 2021 1:17 PM

IT raids today on Anurag Kashyap, Taapsee Pannu - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో బాలీవుడ్‌ చిత్ర నిర్మాతలు, నటీ నటులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, హీరోయిన్‌ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున దాడులు చేశారు. ముంబైలోని వారి నివాసాలు, ఇతర ఆస్థులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 22 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిలింస్‌కు సంబంధించి పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఫాంటమ్ ఫిలింస్ కార్యాలయం సహా  ముంబై , పుణేలో  దాదాపు 22 ప్రదేశాలలో ఈ శోధనలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ నిర్మాత వికాస్ బాహెల్‌ ,మధు మంతేనా  ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్సుబ్రమణ్యం (సీఈఓ క్వాన్)ఆస్తులపై కూడా శోధనలు కొనసాగుతున్నాయి.  కాగా  కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఉద్యమిస్తున్న రైతులకు  కశ్యప్, బాహెల్‌ ,  తాప్సీ  మద్దతుగా నిలవడం గమనార్హం.  అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానే, మధు మంతేనా  వికాస్ బహల్  సంయుక్తగా ఫాంటమ్ ఫిలింస్‌  నిర్మాణసంస్థను స్థాపించారు. . హిందీ, తెలుగు, బంగ్లాతో సహా పలు భాషల్లో అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు.  అయితే వికాస్ బహ్ల్‌పైకంపెనీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదుల తర్వాత 2018 లో  దీన్ని రద్దు చేస్తున్నట్టు  ప్రకటించారు.  ఈ తరువాత  అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్‌   అనే సంస్థను స్థాపించగా, విక్రమాదిత్య , మధు మంతేనా కూడా తమ సొంత ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement