కృతి శెట్టితో సినిమా ప్రకటించిన 'పొన్నియిన్ సెల్వన్'
Published
Thu, Jul 6 2023 10:44 AM
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అరుళ్మొళిగా టైటిల్ పాత్రను పోషించి అందరి ప్రశంసలను పొందిన నటుడు జయంరవి. ఈయన నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఎల్కేజీ, కోమాలి, మూక్కుత్తి అమ్మన్, వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. దీనికి జీనీ అనే టైటిల్ను నిర్ణయించారు.
ఈ చిత్రం ద్వారా మిష్కిన్ శిష్యుడు జేఆర్ అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటి కల్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి దేవయాని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్థానిక తిరువేర్కాడు సమీపంలోని పీజీఎస్ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.