ఎవరి లెక్కలు వారివే
బౌరంపేటలో బారులు తీరిన ఓటర్లు● బూత్ల వారీగా పోలింగ్పై అంచనాలు
● చివరి నిమిషం వరకు ఓటర్ల తరలింపులో నిమగ్నం
● గుంభనంగా తీర్పును నిక్షిప్తం చేసిన ఓటరు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు ముగిశాయి. అంచనాలు ఆరంభమయ్యాయి. గ్రేటర్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికి వారు గెలిచి తీరుతామనే ధీమాతోనే ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఇచ్చిన హామీలు, ప్రచారతీరు, పార్టీల విధానాలు, వైఖరులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులు, అనుచరగణాలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు స్థానికంగా నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉన్న ప్రాంతాలు, సామాజిక వర్గాల వారీగా కూడా అభ్యర్థులు భవిష్యత్పైన ఆశలు పెంచుకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకులుగా భావించే వర్గాలపైన ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలు అనుసరించిన వైఖరులు కూడా తమను విజయతీరాలకు తీసుకెళ్తాయనే భావన కూడా అభ్యర్థుల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. దీంతో బీఆర్ఎస్ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఆ పార్టీ ఓట్లు క్రాస్ ఓటింగ్తో బీజేపీ ఖాతాలో చేరుతాయని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటర్లంతా ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే భావన ఉంది. అదే సమయంలో గ్రేటర్లో తమకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, కచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కుతాయనే భరోసా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
మైనారిటీల ఓట్లపై ఆశలు...
బీఆర్ఎస్పై వ్యతిరేకత వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లపైన ఆశలు పెట్టుకుంది. ఎంఐఎంతో కాంగ్రెస్కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. దీంతో మైనారిటీ ఓట్లు తమకే పడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, ఆ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారం కూడా తమకు బాగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, తదితర అణగారిన వర్గాల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలోనే వచ్చిపడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ‘బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి మాత్రమే పడుతుందనే అభిప్రాయం సరైంది కాదు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ఓట్లు పడే అవకాశం ఉంది.’’ అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తాము చేపట్టబోయే ప్రాజెక్టులు కాంగ్రెస్కు సానుకూలతను తెచ్చి పెట్టాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అయోధ్య రాముడు గెలిపిస్తాడా...
గ్రేటర్లో యువత, ఐటీ వర్గాలు తమకు బలమైన ఓటు బ్యాంక్ అని బీజేపీ అంచనాలు వేస్తుంది. దేశ అంతర్గత భద్రతపైన మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో మోదీ హయాంలోనే ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందనే భావన కూడా యువతలో బలంగా ఉంది. ఈ రెండు అంశాలతో పాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం వల్ల హిందువుల ఓట్లు తమకే పడుతాయని బీజేపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.