Madhavan and Kangana Ranaut to reunite on screen after 8 years - Sakshi
Sakshi News home page

8 ఏళ్ల తర్వాత మళ్లీ జత కడుతున్న మాధవన్‌- కంగనా

Published Tue, Jun 6 2023 7:49 AM

Madhavan, Kangana Ranaut Reunite On Screen After 8 Years - Sakshi

హీరో మాధవన్‌, హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రాబోతోంది. అలైప్పాయుదే సినిమా ద్వారా కోలీవుడ్‌కు కథానాయకుడిగా పరిచయమై చాక్లెట్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు మాధవన్‌. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆల్‌ రౌండర్‌గా రాణిస్తున్నాడు. మరోపక్క బాలీవుడ్‌లో సంచలన నటిగా ముద్ర వేసుకుంది కంగనా రనౌత్‌. తమిళంలో తలైవి చిత్రంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించి ఆమె ఇక్కడ పాపులర్‌ అయ్యారు.

వీరిద్దరూ బహుభాషా నటులే. దర్శకులుగానూ అవతారం ఎత్తారు. ఇకపోతే మాధవన్‌, కంగనా రనౌత్‌ కలిసి 2011లో నటించిన హిందీ చిత్రం తను వెడ్స్‌ మను మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇదే జంట మళ్లీ దానికి సీక్వెల్‌లో నటించింది. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ సారి ఈ జంట నటింబోతోంది తమిళ చిత్రంలో కావడం విశేషం.

ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ అధినేత రవీంద్రన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా అయోద్ది చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: ఐటం పాప బాగా రిచ్‌.. నైట్‌ డ్రెస్‌కే రూ.90,000

Advertisement
Advertisement