Mahesh Babu In Major Trailer Launch: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్‌ బాబు

9 May, 2022 19:50 IST|Sakshi

''మై సన్ .. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ .. వెనకడుగు వేసే అవకాశం వుంది.. తప్పించుకునే దారి వుంది.. ముందు వెళితే చనిపోతాడని తెలుసు .. అయినా వెళ్లాడు. చావు కళ్లల్లో చూసి.. 'నీవు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు' అన్నాడు''..  ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ డైలాగ్, దాని తగ్గటు చూపించిన సందీప్ పోరాటానికి చప్పట్లు కొట్టాల్సిందే. సినిమా పై భారీ అంచనాలు పెంచిన 'మేజర్' ట్రైలర్ .. సినిమాని ఎప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని పెంచింది. 

 యంగ్‌ హీరో అడివి శేష్  పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

2.28 నిమిషాలు గా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్ గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్, డైలాగ్స్, ఆయన నటన అద్భుతంగా వుంది. 

 
అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్లుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది.'' అన్నారు. 

హీరో అడివి శేష్ మాట్లాడుతూ..  మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రెండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది మేజర్ లో చూస్తారు. మహేశ్‌ గారు మేజర్ సినిమాకి బ్యాక్ బోన్. ఏం జరిగినా మహేశ్ గారు ఉన్నారనే ఒక నమ్మకం. కొవిడ్ లాంటి కష్టకాలంలో మహేశ్‌, నమ్రతగారే మమ్మల్ని నిలబెట్టారు. అబ్బూరి రవి గారి కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్నారు. మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
 
ఈ సినిమా మొదలుపెట్టినపుడు పాన్ ఇండియా సినిమా, మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్నారని కొందరు అన్నారు. కానీ అది అసలు విషయం కాదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఈ దేశం ముద్దు బిడ్డ. ఆయన మాతృ భాష మలయాళం కాబట్టి మలయాళంలో డబ్ చేశాం, మన తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో చేశాం, దేశం మొత్తం చూడాలి కాబట్టి హిందీ చేశాం. ప్రతి సీన్, షాట్‌ని తెలుగు, హిందీలో షూట్ చేశాం. మన ఉద్దేశం సరైనప్పుడు విశ్వమే మనకు సహకరిస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. అనురాగ్, శరత్ అన్నదమ్ముల్లా తోడున్నారు. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ కోసం కూడా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేస్తాం. ట్రైలర్ తో దిమ్మతిరిగింది. సినిమా హృదయాన్ని తాకేలా ఉంటుంది'' అన్నారు.     

దర్శకుడు శశి కిరణ్ తిక్క  మాట్లాడుతూ..  2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మహేశ్‌ గారు మా వెనుక ఉండటం ఒక ప్రత్యేకమైన బలం.  నమ్రత గారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు.  అడివి శేష్‌తో  రెండు సినిమాలు చేశాను. అతని గురించి ఒక పుస్తకం రాయొచ్చు. కష్టపడటంలో శేష్ తో పోటిపడితే చాలు మనం విజయం సాధించినట్లే.  ప్రకాష్ రాజ్, రేవతి అద్భుతంగా చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యానో.. మానిటర్ లో ప్రకాష్ రాజ్, రేవతి గార్ల నటన చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నా యూనిట్ మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్'' అన్నారు 

''మేజర్ సినిమాలో  భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. మహేశ్‌ బాబు గారికి నమ్రత మేడమ్ కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ కి కూడా ధన్యవాదాలు . హీరో అడివి శేష్, దర్శకుడు శశి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మేజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు జూన్ 3న థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను'' అని హీరోయిన్ సాయి మంజ్రేకర్ తెలిపారు. 

'అడవి శేష్ ఈ సినిమా కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డారు. సోనీ పిక్చర్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నమ్రత చాలా సపోర్ట్ చేశారు.  మహేశ్‌ ఒక్క మాట మాలో గొప్ప ఎనర్జీని నింపుతుంది. మహేశ్‌ చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు.' అని కో ప్రొడ్యుసర్ శరత్ పేర్కొన్నారు. 

కో ప్రొడ్యుసర్ అనురాగ్ మాట్లాడుతూ.. మహేశ్‌ బాబు 'మేజర్' ట్రైలర్ లాంచ్ కి రావడం ఆనందంగా ఉంది. బొమ్మరిల్లు సినిమాకి మా నాన్నతో వెళ్లాను. అప్పుడే నిర్మాత అవుతానని నాన్నతో చెప్పా. ఇన్నాళ్ల తర్వాత మహేశ్‌ బాబుగారి లాంటి పెద్ద స్టార్ తో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందాన్ని ఇచ్చింది. జీఎంబీ లాంటి స్టార్ బ్యానర్ ఇచ్చి మమ్మల్ని మొదటి నుంచి ఇప్పటివరకూ మహేశ్‌ బాబుగారి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మహేశ్‌ గారు కెరీర్ మొత్తం రిస్కులు తీసుకునే జర్నీ చేశారు. మేము అంతా కొత్తవాళ్లం. మాతో కూడా రిస్క్ తీసుకుంటారనే నమ్మకంతో ఆయన దగ్గర కి వెళ్లాం. మా నమ్మకం నిజమైంది. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. సోనీ పిక్చర్స్ కు థ్యాంక్స్. బ్లడ్ పెట్టి పనిచేయడం అంటే ఏమిటో అడవి శేష్ దగ్గర నేర్చుకున్నా. దర్శకుడు శశి చాలా కూల్. ఆతని బ్యాలన్స్ అద్భుతంగా వుంటుంది. హీరోయిన్ సాయి అద్భుతమైన పాత్ర చేసింది. శోభిత ధూళిపాళ్ల నటన కూడా ఆకట్టుకుంటుంది. సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మహేశ్‌ గారు ఈ సినిమా చూశారు. జూన్ 3న వస్తున్నాం. ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి ఈ చిత్రం ఘనమైన నివాళిగా ఉండబోతుంది'' అన్నారు.

మరిన్ని వార్తలు