క్రేజీ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌లోకి నయనతార | Actress Nayanthara And Vetrimaaran Movie Plan, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

క్రేజీ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌లోకి నయనతార

Published Sat, Feb 17 2024 7:50 AM

Nayanthara And Vetrimaaran Movie Plan - Sakshi

తమిళ చిత్ర పరిశ్రమలో వెట్రిమారన్‌కు దర్శకుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడుగళంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే ఆ చిత్ర కథానాయకుడు ధనుష్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించారు. ఆ తర్వాత విచారణై, అసురన్‌, విడుదలై ఇలా వరుసగా వైవిద్యభరిత కథా చిత్రాలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా గ్రాస్‌ రూట్‌ ఫిలిమ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉదయం ఎల్‌హెచ్‌ 4, పొరియాళన్‌, కాక్కా ముట్టై, విచారణై, వడ చైన్నె వంటి సక్సెస్‌ చిత్రాలను నిర్మించారు.

ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న వెట్రిమారన్‌ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. విశేషమేమిటంటే ఇందులో నయనతార నాయకిగా నటించబోతున్నారట. బిజీగా ఉన్న ఈ భామ త్వరలో తన సొంత బ్యానర్‌ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనికి వెట్రిమారన్‌ శిష్యుడు విక్రమన్‌ అశోకన్‌ దర్శకత్వం వహించారన్నారు. ఇందులో నటుడు కవిన్‌ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ రేర్‌ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Advertisement
Advertisement