స్టార్ హీరో సినిమా అనగానే ప్రేక్షకుడి మెదడులో తిరిగేవి భారీ ఫైట్లు, కేక పుట్టించే డైలాగులు, హుషారెత్తించే సాంగ్స్, ఈలలు వేయించే స్టెప్పులు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఉప్పు లేని పప్పులా సినిమా చప్పగా ఉంటుందని ఫీలవుతారు సినీ ప్రేమికులు. ఇక సినిమా కథను బట్టి వీటి ప్రాధాన్యతలు కూడా మారుతుంటాయి. అయితే ఇప్పుడు ఫిల్మీదునియాలో వినిపిస్తున్న ముచ్చట ఏంటంటే.. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్ ఒక్క పాట కూడా లేకుండా తెరకెక్కుతోందట.
కథను నీట్గా నడిపించాలంటే పాటలు మర్చిపోవాల్సిందేనట. ఈ విషయం విని చాలామంది షాక్కు గురవుతున్నారు. పాటలతోనే సినిమాకు హైప్ వస్తున్న ఈ రోజుల్లో సాంగ్స్ను సైడ్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే సినిమాలో ఆటాపాటా లేకపోయినా థీమ్ సాంగ్ ఒక్కటి మాత్రం పెడదామన్న ప్లాన్లో ఉందట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. ఏదేమైనా ఇద్దరు బడా హీరోలు కలిసి చేస్తున్న సినిమాలో పాట లేకపోతే మజా ఏముంటుందని నిరుత్సాహపడుతున్నారు అభిమానులు. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి.
కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ఆరంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో హైదరాబాద్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే– సంభాషణలు అందిస్తున్నారు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ.
చదవండి: పవన్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న డైరెక్టర్!