Prabhu Deva Daughter First Appearance: భార్య, నెలన్నర పాపతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ప్రభుదేవా
Published
Sat, Jul 22 2023 12:40 PM
సాక్షి, తిరుపతి: నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రభుదేవా, ఆయన భార్య హిమాని, తమ పాపతో పాటు తండ్రి సుందరం మాస్టరుతో కలిసి సాధారణ భక్తులు నిలబడే క్యూ లైనులో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
మొదటి పెళ్లి- విడాకులు
కాగా ప్రభుదేవా గతంలో రమాలత్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా అందులో ఓ అబ్బాయి చిన్నవయసులోనే మరణించాడు. తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రభుదేవా సన్నిహితంగా మెదలడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ను పెళ్లాడాడు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చాయి.
50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రైన ప్రభుదేవా
దీనిపై ప్రభుదేవా సైతం స్పందిస్తూ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యానని, ఇప్పుడే జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కొంతకాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని భావిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన కూతురి ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా చూపించలేదు. తాజాగా అతడు భార్యాపిల్లలతో కలిసి తిరుమలలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు.