సరికొత్త ఫీచర్స్‌తో స్టూడియో నిర్మాణం.. బిజినెస్‌లో స్పీడు పెంచిన హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

సరికొత్త ఫీచర్స్‌తో స్టూడియో నిర్మాణం.. వ్యాపారంలో స్పీడు పెంచిన హీరోయిన్‌

Published Tue, Apr 9 2024 9:25 AM

Preetha Vijayakumar Good Luck Studio Advanced Works - Sakshi

మూడు స్టూడియోలను నిర్మించిన హరి,ప్రీత దంపతులు

ప్రీత ప్యాలెస్‌ పేరుతో కల్యాణ మండపం

మద్రాస్‌ కాఫీ పేరుతో ప్రాంచైజీలు

పాపులర్‌ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతా విజయకుమార్ నిరూపిస్తున్నారు.  నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత     ప్రియమైనా నీకు, మా అన్నయ్య,    క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాల్లో కనిపించిన ఆమె 2002లో దర్శకుడు హరితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో పాటుగా వ్యాపార రంగంలో రాణిస్తుంది.

కోలీవుడ్‌లో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న దర్శకుడు హరి. ఈయన గత ఏడాది 'గుడ్‌ లాక్' పేరుతో ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాల కోసం చెన్నైలో స్టూడియోను ఏర్పాటు చేశారు. ఆది ఇప్పుడు ద్విగ్విజయంగా తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ఈ కపుల్స్‌ తన యూనిట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. గుడ్‌ లక్‌ స్టూడియో మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

తన స్టూడియోను మరింత ఆధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. 5.1 మిక్సింగ్, డబ్బింగ్ వసతులను సమకూర్చినట్లు తేలిపారు. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానన్నారు. ఇలా మొత్తం మూడు స్టూడియోలను ఈ కపుల్స్‌ నిర్వహిస్తున్నారు. వాటి బాధ్యతలు ఎక్కువగా ప్రీతా చూసుకుంటారు. కాగా ప్రస్తుతం విశాల్ హీరోగా రత్నం చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి ప్రియభవానీ శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్య క్రమాలు జరుపుకుంటోంది. పక్కా మాస్ మసాలా కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

దర్శకుడు హరి, విశాల్ హీరోగా ఇంతకు ముందు భరణి, పూజై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో తాజా చిత్రం రత్నంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించడం గమనార్హం.

ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్‌ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్‌ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది.

Advertisement
Advertisement