సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘జైలర్’ విడుదలకు రెడీగా ఉంది . కానీ ఇదే పేరుతో మలయాళీ దర్శకుడు సక్కిర్ మడథిల్ కూడా ఓ సినిమాను తీస్తున్నారు. దీంతో, ‘జైలర్’ టైటిల్ విషయంలో తాజాగా పెద్ద దుమారమే రేగుతుంది. మలయాళీ చిత్ర దర్శకుడు సక్కిర్ మడథిల్ స్పందించాడు. తను చేస్తున్న జైలర్ సినిమా బడ్జెట్ రూ. 5 కోట్లు అని తెలిపాడు. తనది చిన్న చిత్రమని ఆయన పేర్కొన్నారు. పెద్ద బడ్జెట్తో రజనీ కాంత్ సినిమా వస్తోంది. దీంతో తాను భారీగా నష్టపోతానని ఆయన తెలిపాడు. హీరో రజనీకాంత్ అంటే తనకెంతో ఇష్టమని ఆయన చెప్పారు. ఈ సినిమాపైనే తన జీవితం ఆధారపడి ఉందంటూ సక్కిర్ మడథిల్ వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?)
1957లో చోటు చేసుకున్న వాస్తవ సంఘటన ఆధారంగా తాను జైలర్ సినిమాను తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించి 2021 ప్రారంభంలోనే జైలర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేపించానని తెలిపాడు. కానీ కొద్దిరోజుల తర్వాత రజనీ- నెల్సన్ కూడా ఇదే టైటిల్తో పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నాడు. టైటిల్ మార్చుకోమని సన్ పిక్చర్స్ను ఇప్పటికే పలు మార్లు చెప్పానని అయినా ఫలితం లేదని చెప్పుకొచ్చారు. కనీసం కేరళలో అయినా రజనీ జైలర్ సినిమా టైటిల్ను మార్చి విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు.
నా కూతురు నగలు తాకట్టు పెట్టాను: సక్కిర్ మడథిల్
'నేనే నిర్మాతగా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా తీశాం. దీని కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టాను. సినిమా కోసం నా కూతురు నగలు, ఇల్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాను. సొంత కారును కూడా అమ్మేసుకున్నాను. అవి సరిపోక పోవడంతో త్వరగా చెల్లించవచ్చని ఎక్కువ వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకువచ్చి ఈ సినిమాను నిర్మించాను. కనీసం రజనీకాంత్ సార్ అయినా నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.
ఈ టైటిల్ క్లాష్ రావడం వల్ల ఒక్కొసారి నాకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయి.' అంటూ మలయాళీ దర్శకుడు సక్కిర్ మడథిల్ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ‘జైలర్’ ఆగస్టులో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. సక్కిర్ తెరకెక్కించిన ‘జైలర్’ సెప్టెంబర్లో కేరళలో విడుదల కానుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై సన్ పిక్చర్స్ ఎలా స్పందిస్తుందో తేలాల్సి ఉంది.