Cyberabad Police Jhalak To Karthikeyan, Counter Sharing Chavu Kaburu Challaga Movie Poster Together! - Sakshi
Sakshi News home page

'సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు'

Published Fri, Mar 19 2021 7:25 PM

Sharing Chavu Kaburu Challaga Poster Cyberabad Police Counter To Karthikeya - Sakshi

హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి  జంటా నటించిన చిత్రం  'చావు కబురు చల్లగా'. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాలో  కార్తికేయ శవాలు మోసే బస్తీ బాలరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సైబరాబాద్‌ పోలీసులు హీరో కార్తికేయ(బస్తీ బాలరాజు)కు ఫన్నీగా వార్నింగ్‌ ఇచ్చారు. చావు కబురు చల్లగా సినిమాలోని కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్‌పై వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ..'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్‌ చేశారు. దీన్ని కార్తికేయ, లావణ్య త్రిపాఠిలకు ట్యాగ్‌ చేశారు.

ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే సైబరాబాద్‌ పోలీసులు..లేటెస్ట్‌గా చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సినిమా పోస్టర్‌ను వాడి హెల్మెట్‌ ఆవశ్యకత గురించి చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. కౌశిక్ పెగల్లపాటి‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటించగా, లావణ్య..నర్సుగా నటించింది. సీనియర్‌ నటి ఆమని కీలక పాత్ర పోషించగా, యాంకర్‌ అనసూయ స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. 

చదవండి : ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ
(చిల్లర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్‌)

Advertisement
Advertisement