డబ్బులు ఇవ్వకుండా ఆయనను మోసం చేశారు: శ్రీహరి భార్య శాంతి | Sakshi
Sakshi News home page

Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా ఎంతోమంది ఆయనను మోసం చేశారు’

Published Tue, Sep 27 2022 12:16 PM

Srihari Wife Shanthi About Financial Issues After Husband Died - Sakshi

దివంగత నటుడు శ్రీహారికి చాలామంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి శ్రీహరి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత విలన్‌గా, హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంతేకాదు వ్యక్తిగతంగా ఎంతోమందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలో 2009లో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ఆయన చనిపోయాక ఇండస్ట్రీలో తమని పలకరించేవారు కూడా లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి.

చదవండి: మహిళా యాంకర్‌ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్‌

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఆయన సాయం తీసుకున్న చాలామంది కనీసం పలకరించడానికి కూడా రాలేదని, ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతోనే అలా చేశారన్నారు. ‘బావకు(శ్రీహరికి) సినిమాలు అంటే పిచ్చి. ఆ ఇష్టంతో ఎవరు వచ్చి అడిగిన కాదనకుండా చేసేవారు. ఆయన రెమ్యునరేషన్‌ కూడా పెద్దగా డిమాండ్‌ చేసేవారు కాదు. అలా చాలామంది సినిమా తరువాత డబ్బులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా ఎగ్గోట్టినవారే ఎక్కువమంది ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసి ఉంటే ఇప్పుడు మాకు ఓ 10 బంగ్లాలు ఉండేవి. అయితే చిరంజీవిగారి సంస్థ, మరొక రెండు మూడు సంస్థలు మాత్రమే డబ్బులు కరెక్టుగా ఇచ్చేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

చదవండి: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం

అనంతరం ‘అలా బావ(శ్రీహరి) చేసిన ఎన్నో సినిమాలకు డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు ఆయన చనిపోయే ముందు చేసిన సినిమాలకు కూడా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు. ఆయన చనిపోయాక కనీసం వారు పలకరించేందుకు కూడా రాలేదు.  కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు కాల్‌ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్‌ చేశారట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్‌ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్‌ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాల‌కృష్ణ‌లా ఎవ‌రూ కాల్ చేయ‌లేదు’ అని చెప్పారు ఆమె. శ్రీహరి చనిపోయాక వారి ఇంటి మీద అప్పులు తీర్చడానికి తన నగలు, కార్లు అమ్మానని చెప్పారు శాంతి.

Advertisement
Advertisement