కన్నడ మూవీ కాంతార ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన నటులు రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆ జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. కాంతార సినిమాను వీక్షించిన భామ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో పాటు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేలా అందంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా ఈ చిత్రంపై సమీక్షను వెల్లడించారు.
పూజా తన ఇన్ స్టాలో స్టోరీలో రాస్తూ..'మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి. మీ మనసులో నుంచి వచ్చిన స్టోరీనే చెప్పండి. ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు ఫిదా అయ్యా. ఈ చిత్రం ద్వారా రిషబ్ శెట్టి ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి సూపర్ హిట్ అందుకున్నావు. రాబోయే రోజుల్లో మీరు మరిన్నీ ప్రశంసలు అందుకోవాలి' అంటూ పూజా రాసుకొచ్చింది.
కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా ఈ సినిమాను తెరకెక్కించారు. కర్ణాటకలోని తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రం రూపొందించారు. స్థానికంగా ఉండే ప్రజలు గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని మూవీలో చక్కగా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. విడుదలైన ‘కాంతార’ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకూ రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా వేస్తున్నారు.